ప్రజాశక్తి – కాకినాడ
ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బుధవారం జిల్లా రెడ్ క్రాస్ కార్యా లయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ జె.నివాస్, రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు సర్ జీన్ హెన్రీ డ్యూ నాంట్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పిం చారు. అనంతరం రెడ్ క్రాస్ ప్రతిజ్ఞ చేశారు. మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని, స్వచ్ఛంద రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతర్జాతీయ తలసీమియా దినోత్సవ సందర్భంగా తలసీమియా వ్యాధిగ్రస్తులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం రెడ్ క్రాస్ జనహిత జనరిక్ మందుల షాపు, ఆసుపత్రి, రక్త నిధి కేంద్రం, ఐ బ్యాంకు, ఇతర సేవా విభాగాలను ఛైర్మన్ వైడి.రామారావుతో కలిసి కలెక్టర్ సందర్శించి ప్రశంసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ కాకినాడ జిల్లా శాఖ రాష్ట్రంలో అగ్రగామిగా సేవలను అందిస్తున్నందని కొనియాడారు. సంస్థ యొక్క మౌలిక వసతులు కూడా ఉన్నతంగా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఛైర్మన్ వైడి.రామారావు మాట్లాడుతూ భారత దేశంలో రెడ్ క్రాస్ ఏర్పడి 100 ఏళ్ళు పూర్తి అయిందని, కాకినాడ శాఖ 96 ఏళ్ళు పూర్తి చేసుకుందని తెలిపారు. అనేక సేవా విభాగాల ద్వారా కాకినాడ జిల్లా శాఖ ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి కె.శివకుమార్, కోశాధికారి ప్రసాద్బాబు, వైద్యాధికారులు డాక్టర్ దుర్గరాజు, రామకృష్ణ రామకృష్ణయ్య, రామమోహన్ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.