ఇచ్చెర్ల (శ్రీకాకుళం) : భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు మోడల్ ఎంసెట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి.చందు బి.హరీష్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు మోడల్ ఎంసెట్ పోస్టర్ను సోమవారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి చందు బి హరీష్ మాట్లాడుతూ విద్యారంగంలో ఉండే సమస్యల పైన విద్యార్థి హక్కుల కోసం భారత విద్యార్థి ఫెడరేషన్ నిరంతరం కూడా పోరాడుతుందని చెప్పారు. అంతేకాకుండా విద్యార్థులకు ఎటువంటి సమస్య వచ్చినా సరే ఎస్ఎఫ్ఐ ముందుండి వారి సమస్యలను పరిష్కరిస్తుంది అన్నారు. విద్యార్థుల కోసం పోరాటాలు మాత్రమే కాకుండా విద్యార్థుల్లో దాగి ఉండే అకుంఠిత ప్రతిభను వెలికి తీసి, వారి జీవితాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు ఎస్ఎఫ్ఐ ఒక మంచి దిశా నిర్దేశం చేస్తుందని వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే 10వ తరగతి విద్యార్థులకు ప్రజ్ఞ వికాస్ పరీక్ష, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మోడల్ ఎంసెట్ తదితర పరీక్షలు నిర్వహించి, వారికి పరీక్షలు అంటే భయం పోగొట్టే విధంగా ఎస్ఎఫ్ఐ ప్రయత్నిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగానే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులకు మోడల్ ఎంసెట్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ పరీక్ష శ్రీకాకుళం జిల్లా ఇచ్చెర్ల లో ఉన్న శ్రీశివాని ఇంజనీరింగ్ కాలేజీలో ఆన్లైన్లో ఏప్రిల్ 17 నుండి 19 వరకు ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలో చాలామంది విద్యార్థులు అనేకనేక కోచింగ్ సెంటర్లలో ఎంసెట్ కోసం కోచింగ్లు తీసుకొని పరీక్షకు నేరుగా వెళ్లి భయభ్రాంతులకు లోనే సరిగ్గా పరీక్ష రాయలేక పోయినవారికి ఇది ఒక సువర్ణ అవకాశం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ రాజు, జిల్లా సహాయ కార్యదర్శి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.