- ప్రజ్ఞా వికాసం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వాళ్లకి బహుమతులు ప్రధానం
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పదోవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన ప్రజ్ఞా వికాసం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వాళ్లకి బహుమతులు ప్రధాన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒకటవ పట్టణ సిఐ వెంకట్రావు ,యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు, జీ.వీ.కే జిల్లా కన్వీనర్ కె.శ్రీనివాసరావు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి రాము ,సిహెచ్ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. పదోవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని కోరుతూ విద్యార్థులు పాఠ్యాంశాలలో మెరుగుపడుతూ ఈ సమాజం కోసం ఉపయోగపడేలా విద్యను నేర్చుకోవాలని పాఠ్య పుస్తకాలే కాకుండా ఈ సమాజం కోసం ఉపయోగపడే పుస్తకాలను ఈ సమాజాన్ని మార్పు చెందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. దానిలో భాగంగా ఇలాంటి పరీక్షలు రాయడం ద్వారా విద్యార్థుల్లో పబ్లిక్ పరీక్షల్లో ఉండే భయాన్ని తొలగించవచ్చని మానసికంగా బలోపేతం కావడానికి బాగా ఉపయోగపడతాయన్నారు. ఇలాంటి పరీక్షలు నిర్వహించేందుకు ఎస్ఎఫ్ఐ నాయకులకు ,విద్యార్థులకు, ప్రజలు మేధావులు సహకరించేలా కృషి చేయాలని కోరుతూ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి అభినందనలు తెలియజేశారు. దీనిలో భాగంగా జిల్లా ప్రధమ బహుమతి వై.కృష్ణవర్ధన్ (రవీంద్ర భారతి స్కూల్, ఎస్.కోట) కి మెమొంటో, రూ.5 వేలు నగదు బహుమతి, జిల్లా ద్వితీయ బహుమతి ఎం.ఆశా దీపిక (నారాయణ ఒలంపియాడ్, విజయనగరం) కు మెమొంటో , 3 వేలు నగదు బహుమతి, జిల్లా తృతీయ బహుమతి, పి సౌభాగ్య (గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్, నెలిమర్ల)కు మెమొంటో 2 వేలు నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శిలు పీ. రమేష్, ఎస్ సోమేశ్,కే.రమేష్ జిల్లా కమిటీ నాయకులు రాజు ,వంశీ ,డేవిడ్ మరియు నాయకులు మణి, సంధ్య, అంజలి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.