ప్రజాశక్తి – సాలూరు : నియోజకవర్గ పరిధిలో సాలూరు టౌన్, మండలం, పాచిపెంట, మక్కువ మండలాల్లో సాధారణ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 350 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అదనపు ఎస్పీ నరేష్ బాబు, డిఎస్పీ మురళీధర్ ఆధ్వర్యాన ఏడుగురు సిఐలు, 10 మంది ఎస్ఐలతో కలిపి 12 సిఎపిఎఫ్ సెక్షన్లు, 11 క్యుఆర్టీ టీంలతో కలిపి 350 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. టౌన్ సిఐ వాసునాయుడు, రూరల్ సిఐ బాలకృష్ణతో కలిపి ఏడుగురు సిఐలు, 10 మంది ఎస్ఐలు బందోబస్తు ఏర్పాట్లలో ఉంటారు. 14 పోలింగ్ ప్రాంతాలను సమస్యాత్మక, 10 పోలింగ్ ప్రాంతాలను తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. అన్ని గ్రామాల్లోనూ 144 సెక్షన్ విధించినట్లు డిఎస్పీ మురళీధర్ చెప్పారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం విధులు నిర్వహించాలని సూచించారు.