ప్రజాశక్తి-తిరుపతి : దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా తిరుమలలో శనివారం పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం ఈరోజు ఉదయం 6 గంటలకు తిరుమల ఆలయం ముందు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో పల్స్ పోలియో చుక్కల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అశ్విని ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్, జియన్ సి టోల్ గేట్, సిఆర్ ఓ, పిఎసి 1, 2, కొత్త బస్టాండ్, హెల్త్ ఆఫీస్, విక్యూసి 1, 2, ఏటిసి, ఎంబిసి-34, వరాహస్వామి విశ్రాంతి గఅహం 1, రాంభగీచా రెస్ట్ హౌస్ 1, కేకేసి, మేదరమిట్ట, పాపవినాశనం, సుపాదం, బాలాజీ నగర్ వినాయక ఆలయం, బాలాజీ నగర్ బాల బడి, ఎస్వి హై స్కూల్, తిరుమల ఆలయం లోపల, వెలుపల, ఉద్యోగుల డిస్పెన్సరీలతో సహా మొత్తం 25 కేంద్రాలలో పోలియో చుక్కలు వేస్తారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం 10.30 గంటలకు ఎస్వీ హైస్కూల్ నుంచి బాలాజీ నగర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి యాత్రికులు స్థానికుల కోసం జీపులో ప్రకటనలు చేస్తూ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.