జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి
ప్రజాశక్తి-విజయనగరం కోట : ఎన్నికల రోజున పోలింగ్ బూత్ల వద్ద ఏర్పాట్లన్నీ పక్కాగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. బుధవారం సెక్టార్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల సిబ్బందికి సరైన ఆహారం సమయానికి అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మాక్ పోల్ సమయానికి ఖచ్చితంగా జరిగేల చూడాలని, ఆర్ఒ , పిఒ లతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. పోలింగ్ స్టేషన్ వద్ద బారికేడింగ్, లైటింగ్ , తాగు నీరు, అవసరమైన చోట జనరరేటర్ ఏర్పాట్లను చేయాలన్నారు. వంద మీటర్ల బయట ఓటరు అసిస్టెంట్ బూత్ ను ఏర్పాటు చేసి బిఎల్ఒను ఇంచార్జ్గా పెట్టాలని తెలిపారు. ఎన్నికల సిబ్బందికి టిఎ, డిఎ ల చెల్లింపులు , పోల్ రిపోర్ట్లు అందించే బాధ్యత సెక్టార్ అధికారులదేనని స్పష్టం చేసారు. పోలింగ్ ప్రారంభం నుండి రెండు గంటల లోపలే అన్ని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలని, ముగిసే లోపల మరల అన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించాలని, పోలింగ్ అనంతరం రిసెప్షన్ సెంటర్కు ఇవిఎంలను చేర్చే వరకు బాధ్యత వహించాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో జెసి కార్తీక్, డిఆర్ఒ అనిత, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.