రాజ్యాంగ పరిరక్షణకు మరో పోరాటానికి సన్నద్ధం కావాలి : సిపిఎం నేతలు

ప్రజాశక్తి-శ్రీకాకుళం : మందస జమీందారీ వ్యతిరేక పోరాటంలో బ్రిటిష్‌ సామ్రాజ్యవాద తూటాలకు బలైన తొలి మహిళ వీరనారి గున్నమ్మ పోరాటస్ఫూర్తితోనే నేడు ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణకు మరో పోరాటానికి సన్నద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కమిటీ సభ్యులు నంబూరు షణ్ముఖరావు పిలుపునిచ్చారు. సోమవారం మందసా మండలం వీరగున్నమ్మపురంలో వీరనారి గున్నమ్మ స్మారక స్థూపానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …. జమీందారీ వ్యతిరేక పోరాటంలో 1940 ఏప్రిల్‌ ఒకటో తేదీన వీరనారి గుణ్ణమ్మతోపాటు గుంట బుడియాడు, గొర్రెల జగ్గయ్య, కర్రి కలియాడు, గుంట చిన్నారాయణ వీరమరణం పొందారని అన్నారు. ఏ ఆశయం కోసం అయితే ప్రాణాలర్పించారో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు అవి ప్రమాదంలో పడ్డాయని చెప్పారు. బిజెపి ప్రభుత్వం మోడీ నాయకత్వంలో రాజ్యాంగ పునాదులను ధ్వంసం చేస్తుందని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం దేశ సంపదైన సహజ వనరులను ప్రభుత్వ రంగ సంస్థలను భూములను కార్పొరేట్లకు అప్పణంగా కట్టబెడుతుందని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తుందని అన్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపితో నేడు తెలుగుదేశం ప్రత్యక్షంగాను, పరోక్షంగా వైసిపి లు వెళ్లడాన్ని సిగ్గుచేటన్నారు. వామపక్ష లౌకిక శక్తుల ప్రత్యమ్నాయమే దేశానికి అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు హనుమంతు, ఈశ్వరరావు, ఆర్‌.దిలీప్‌ కుమార్‌, ధర్మారావు, పి.అప్పలస్వామి, తదితరులు పాల్గన్నారు.

➡️