ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఎస్మా చట్టాన్ని తక్షణమే విరమించుకోవాలని సిఐటియు మండల కార్యదర్శి వద్దిపర్తి అంజిబాబు అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆచంట కచేరి సెంటర్లో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె శుక్రవారం 39వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంజిబాబు మాట్లాడుతూ అక్క చెల్లెమ్మలు అంటూ ఓట్లు పొంది అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలకు అన్యాయం చేశారని విమర్శించారు. అనంతరం ఆచంటకచేరి సెంటర్లో సీఎం డౌన్ డౌన్, ఎస్మా చట్టాని తక్షణమే రద్దు చేయాలి, ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి, సిగ్గు సిగ్గు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి జిల్లా ఉపాధ్యక్షురాలు వైట్ల ఉషారాణి, అంగన్వాడీలు మైలే విజయలక్ష్మి, పద్మ, నాగలక్ష్మి, సుజాత, ఝాన్సీ, సత్యవతి, వెంకటలక్ష్మి, సత్య కుమారి, జి కమల, గౌరీ, మహేశ్వరి, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.