లేపాక్షిలో నోట్ల కట్టల కలకలం..!

May 11,2024 00:20 #hindupuram

-ఓ ఇంటి వద్ద బయటపడ్డ డబ్బు సంచులు
-స్వాధీనం చేసుకున్న అధికార పార్టీ నాయకులు
ప్రజాశక్తి-హిందూపురం :సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షిలో నోట్ల కట్టల కలకలం రేగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చిలమత్తూరు నుంచి హిందూపురం వైపునకు శుక్రవారం తెల్లవారుజామున అధికార పార్టీ నేతకు చెందిన ఓ కారు డబ్బు సంచులతో లేపాక్షికి వెళ్తుండగా పోలీసుల వాహనం చూసి ఇందిరమ్మ కాలనీ వైపు మళ్లింది. నాలుగు డబ్బు సంచుల్లో రెండు సంచులు ఓ ఇంటి సమీపంలోని ముళ్లపొదల్లో విసిరేసి వెళ్లిపోయారు. కారులోంచి సంచులు పడేయడం చూసిన రామాంజినమ్మ, స్థానికులు వచ్చి వాటిని తీసుకెళ్లారు. కొద్దిసేపటి తర్వాత డబ్బులు పడేసిన వారు వచ్చి చూడగా సంచులు లేకపోవడంతో స్థానికులను విచారించారు. చివరకు ఇద్దరు మహిళలు ఆ డబ్బును తీసి వేరే చోట పెట్టినట్లు తెలుసుకున్నారు. దీంతో సంచుల్లో ఉంచిన రూ.రెండు కోట్ల వ్యవహారం బయట పడింది. రామాంజినమ్మ, స్థానికులను, స్థానిక వైసిపి నాయకులు బెదరించడంతో వారు ఒక సంచిని తిరిగి ఇచ్చేశారు. రామాంజినమ్మ ఇంట్లో సోదాలు చేయడంతో రూ.60 లక్షలు బయటపడింది. విషయం తెలుసుకున్న ప్ల్లయింగ్‌ స్వాడ్‌ జ్యోతిక, కానిస్టేబుల్‌ జనార్థన్‌ అక్కడికి చేరుకుని రామాంజినమ్మను విచారించారు. వైసిపికి చెందిన అంజనరెడ్డి, నారాయణ స్వామి, నిసార్‌ పేర్లను ఆమె చెప్పారు. లేపాక్షి మండలం చోళసముద్రం టోల్‌ప్లాజ వద్ద అధికార పార్టీ ముఖ్య నాయకుడు సుమారు రూ.ఐదు కోట్లను కారులో తీసుకుని వస్తుండగా పోలీసులను గమనించి రోడ్డుపక్కన పడేసి వెళ్లిపోయారు. తిరిగి వచ్చి చూస్తే రూ.50 లక్షల సంచి కనబడకుండా పోయినట్లు తెలుస్తోంది.

➡️