ఒట్టావా : ఖలిస్తాన్ వేర్పాటు వాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో అరెస్టయిన ముగ్గురు భారత జాతీయులను మంగళవారం కెనడా కోర్టులో హాజరుపరిచారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టినట్లు స్థానిక మీడియా వాంకోవర్ సన్ తెలిపింది. ముగ్గురిని విడివిడిగా ఎరుపు రంగు టీషర్టుతో బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్లోని సర్రే ప్రావిన్షియల్ కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపింది. విచారణను ఆంగ్లంలో వినిపించేందుకు ముగ్గురూ అంగీకరించారని, ఫస్ట్ డిగ్రీ హత్య, హత్యకు కుట్ర పన్నారనే అభియోగాలను అర్థం చేసుకున్నట్లు తల ఊపారని మీడియా తెలిపింది. 50 మంది మద్దతుదారులు సాక్ష్యమిచ్చేందుకు కోర్టు వసతి గదికి చేరుకున్నారని వెల్లడించింది. విచారణ సమయంలో వందలాది మంది ఖలిస్తాన్ మద్దతుదారులు కోర్టు ఎదుట ఆందోళన తెలిపారని, ఖలిస్తానీ జెండాలు, ఫ్లకార్డులు ప్రదర్శించారని తెలిపింది.
నిజ్జర్ హత్య కేసులో కరణ్ బ్రార్ (22), కమల్ప్రీత్ సింగ్ (22), కరణ్ప్రీత్ సింగ్ (28)లను కెనడా పోలీసులు ఈ నెల 4న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.