అమెరికాలోని రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి

హుజూరాబాద్‌ : అమెరికాలో శనివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యుల వివరాల మేరకు … కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణానికి చెందిన డాక్టర్‌ స్వాతి, డాక్టర్‌ నవీన్‌ దంపతుల కుమారుడు నివేశ్‌ (20), జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోని శివునిపల్లికి చెందిన స్వర్ణకారుడు పార్శి కమల్‌కుమార్‌, పద్మ దంపతుల పెద్ద కుమారుడు గౌతమ్‌కుమార్‌ (19) అమెరికాలోని అరిజోనా స్టేట్‌ విశ్వవిద్యాలయంలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నారు. శనివారం రాత్రి ఈ ఇద్దరు తమ స్నేహితులతో కలిసి విశ్వవిద్యాలయం నుంచి ఇంటికి కారులో వస్తుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం వీరి వాహనాన్ని బలంగా ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో వెనక సీట్లో కూర్చున్న నివేశ్‌, గౌతమ్‌ కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు అక్కడి పోలీసులు ఆదివారం మధ్యాహ్నం మఅతుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గౌతమ్‌కుమార్‌ మృతదేహం స్వగ్రామం చేరుకోవడానికి రెండు మూడు రోజుల సమయం పడుతుందని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. నివేశ్‌ మృతదేహాన్ని హుజూరాబాద్‌కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

➡️