న్యూఢిల్లీ : అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ ఈ నెల 22న ఒక పూట సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయోధ్యలో జరిగే రామ్లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొ నేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వ కార్యాల యాలు, సంస్థలు, కేంద్ర పారిశ్రామిక సంస్థల కార్యాలయాలన్నీ మధ్యాహ్నం 2.30 గంటల వరకు మూతపడి వుంటాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ప్రమాదంలో లౌకిక విలువలు : సిపిఎం
ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం రోజున కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఒక పూట సెలవు ప్రకటించడం, అలాగే ఈ కార్యక్రమానికి మొత్తంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించడం చూస్తుంటే మతపరమైన అంశాన్ని ప్రభుత్వం రాజకీయం చేయడం ఎక్కువైందని స్పష్టమవుతోందని సిపిఎం విమర్శించింది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలతో లౌకిక సూత్రాలకు, విలువలకు తీవ్ర ముప్పు ఏర్పడుతోందని పేర్కొంది. వీటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.