ఆత్మరక్షణలో బిజెపి

Apr 29,2024 01:40 #BJP

రిజర్వేషన్లను రద్దు చేయబోమని పదేపదే వివరణ
రాజ్యాంగాన్ని మార్చబోమంటూ వేడుకోలు
ఒబిసి ఓటు బ్యాంకుకు
గండి పడుతుందని ఆందోళన

న్యూఢిల్లీ : మోడీ సర్కారు అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, రిజర్వేషన్లు ఉండబోవని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలతో బిజెపి ఆత్మరక్షణలో పడింది. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని బిజెపి మార్చబోదని, రిజర్వేషన్లను రద్దు చేయబోదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇటీవలే చెప్పారు. పార్టీపై ముప్పేట దాడి పెరగడంతో ఆయనతోపాటు పలువురు బిజెపి నేతలు డిఫెన్స్‌లో పడి పదేపదే వివరణలు ఇచ్చుకుంటున్నారు. ఈ నెల 25న ‘ది హిందూ’ పత్రిక ప్రతినిధితో రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించారు. ‘రిజర్వేషన్లకు స్వస్తి చెప్పే ప్రసక్తే లేదు. రిజర్వేషన్లు అవసరమని నేను గట్టిగా నమ్ముతున్నాను. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చాల్సిన అవసరమున్నదని కూడా మేము ఎప్పుడూ భావించలేదు’ అని తెలిపారు. ఈ నెల 23న మహారాష్ట్రలోని అకోలాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా రిజర్వేషన్లపై పెదవి విప్పాల్సి వచ్చింది. ‘బిజెపి అధికారంలో ఉంటే ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి రిజర్వేషన్లు రద్దు కావు’ అని చెప్పుకొచ్చారు.
రిజర్వేషన్లను రద్దు చేయడం కోసం రాజ్యాంగాన్ని మార్చాలని బిజెపి ఆలోచిస్తోందని ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగడంతో బిజెపి నాయకులు వరుసగా వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తోంది. బిజెపి ఈ ఆలోచన చేయడానికి కొన్ని బలమైన కారణాలే కన్పిస్తున్నాయి. కేవలం అగ్రవర్ణాల ఓట్లతోనే బిజెపి ప్రభుత్వం ఏర్పడలేదు. 2009 నుండి బిజెపి తన బలాన్ని పెంచుకోవడానికి ఒబిపి ఓట్లే కారణం. బిజెపి ఓట్లలో గణనీయమైన భాగాన్ని సొంతం చేసుకోవడంలో బిజెపి ఏ విధంగా విజయం సాధిస్తోందో సిఎస్‌డిఎస్‌ గణాంకాలు చెబుతున్నాయి.
ఓట్లు రాలవేమోనని…
2009 ఎన్నికల్లో ఒబిసి ఓట్లలో బిజెపి 17% వాటాను పొందింది. 2019 నాటికి అది 47%కి పెరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్లను బిజెపి రద్దు చేస్తే ఒబిసి ఓటు బ్యాంకుకు గండి పడుతుంది. అందుకే రిజర్వేషన్లను రద్దు చేసే ఆలోచన ఏదీ లేదని బిజెపి నేతలు ముక్తాయింపు ఇస్తున్నారు.
వివాదానికి ఆద్యుడు ఆయనే
రాజ్యాంగాన్ని మార్చాలంటే 400కు పైగా స్థానాలు పొందాల్సి ఉంటుందని బిజెపి నేతలు నిన్న మొన్నటి వరకూ చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు వారి నుంచి ఆ మాటే రావడం లేదు. అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను బిజెపి రద్దు చేస్తుందని విమర్శలు రావడం, దీనిపై ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి మద్దతుదారుల్లో నిరసన వ్యక్తం కావడమే దీనికి కారణం. అసలు ఈ వివాదానికంతటికీ కారణం ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మెన్‌ వివేక్‌ దేవ్‌రారు. గత సంవత్సరం ఆగస్టు 14న ఆయన ఓ వార్తాపత్రికలో వ్యాసం రాస్తూ నూతన రాజ్యాంగం ప్రస్తావన తీసుకొచ్చారు. దీనిపై వివాదం చెలరేగడంతో ప్రధాని ఆర్థిక సలహా మండలి వివరణ ఇచ్చుకుంది. రాజ్యాంగాన్ని మార్చాలన్నది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
దేవ్‌రారు బాటలో హెగ్డే
సాక్షాత్తూ మోడీ నియమించిన వ్యక్తే రాజ్యాంగాన్ని మార్చాలని సూచించడం వివాదాస్పదమైంది. అది కొనసాగుతుండగానే ఈ ఏడాది మార్చి 11న కర్ణాటకకు చెందిన బిజెపి ఎంపీ అనంతకుమార్‌ హెగ్డే ఓ ప్రకటన చేస్తూ రాజ్యాంగాన్ని మార్చడానికే 400 సీట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. హెగ్డే సంఫ్‌ుకు సన్నిహితుడు. అధికారి అయిన దేవ్‌రారుతో పాటు సంఫ్‌ు వ్యక్తి హెగ్డే కూడా రాజ్యాంగాన్ని మార్చాలని అభిప్రాయపడిన నేపథ్యంలో అందుకు బిజెపి ఆమోదముద్ర ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు హెగ్డేకు బిజెపి టిక్కెట్‌ ఇవ్వలేదు. ఆయన ప్రసంగ వీడియో మాత్రం సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది.
వీరు కూడా…
కాంగ్రెస్‌ నుంచి ఇటీవలే బిజెపిలోకి ఫిరాయించిన జ్యోతి మీర్థా ఈ నెల 2వ తేదీన ఓ బహిరంగ సభలో తేనెతుట్టెను మరోసారి కదిల్చారు. రాజ్యాంగంలో మార్పులు చేయాలంటే తమ పార్టీకి భారీ మెజారిటీ అవసరమని ఆమె చెప్పారు. మీర్థాపై కాంగ్రెస్‌ విమర్శలు సంధించడంతో ఆమె మౌనం వహించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన లల్లూ సింగ్‌ కూడా నూతన రాజ్యాంగంపై మాట్లాడారు. ఆయన అయోధ్య శాసనసభ నియోజకవర్గానికి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేశారు. రాజ్యాంగాన్ని మార్చాలన్నా లేదా నూతన రాజ్యాంగాన్ని రూపొందించాలన్నా మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమని లల్లూ సింగ్‌ అన్నారు. మిల్కీపూర్‌ శాసనసభ నియోజకవర్గంలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. గత రెండు నెలల కాలంలో రాజ్యాంగంపై మాట్లాడిన నాయకుల్లో ఆయన మూడో వారు.
రాజ్యాంగంలో ఇప్పటికే అనేక మార్పులు చోటుచేసుకున్నాయని, వాటిలో ఎలాంటి ప్రమాదము లేదని మీరట్‌ నుండి బిజెపి అభ్యర్థిగా పోటీచేస్తున్న అరుణ్‌ గోవిల్‌ ఈ నెల 15న చేసిన వ్యాఖ్యకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. మార్పు అనేది అభివృద్ధికి సూచిక అని, అది తప్పేమీ కాదని కూడా ఆయన చెప్పారు.
ఆది నుంచీ అదే వైఖరి
రాజ్యాంగం పైన, రిజర్వేషన్ల పైన బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల ట్రాక్‌ రికార్డును ఓసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్లను సమీక్షించాల్సిన అవసరం ఉన్నదని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ 2015లో ‘పాంచజన్య’ పత్రికలో రాసిన వ్యాసంలో అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలో భారతీయత లేదని ఆర్‌ఎస్‌ఎస్‌ అధికార పత్రిక పాంచజన్య 1949లోనే ఆగ్రహం వ్యక్తం చేసింది.

➡️