- ద్రౌపది ముర్ముకు జాతీయ ఎస్సి కమిషన్ సిఫార్సు
- పిల్ పరిశీలనకు సుప్రీం అంగీకారం
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖలిలో మహిళలపై టిఎంసి గూండాలు వేధింపులకు పాల్పడుతున్న ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు జాతీయ ఎస్సి కమిషన్ (ఎన్సిఎస్సి) బృందం నివేదికను సమర్పించింది. రాష్ట్రంలో రాప్ట్రపతి పాలన విధించాలని నివేదిక సిఫార్సు చేసినట్లు ఎన్సిఎస్సి అధ్యక్షులు అరుణ్ హల్డర్ శుక్రవారం మీడియాకు తెలిపారు. టిఎంసి నాయకుడు షాజహాన్ షేక్, అతని మద్దతుదారులు తమ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని, తమపై లైంగిక వేధింపులకు పాల్పడి, పరారీలో ఉన్న షేక్ను అరెస్టు చేయాలని మహిళలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సందేశ్ఖలిని గురువారం ఎన్సిఎస్సి బృందం సందర్శించింది. బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేశామని, పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని రాష్ట్రపతి హామీ ఇచ్చారని చెప్పారు.
- కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్, బిజెపి నాయకుల అడ్డగింత
సందేశ్ఖలిలో పర్యటించకుండా కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరిని రాంపూర్ గ్రామంలో శుక్రవారం పశ్చిమ బెంగాల్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, ఆయన అక్కడే రోడ్డుపై ఆందోళనకు దిగారు. బిజెపి నాయకులను కూడా అదే గ్రామంలో పోలీసులు అడ్డుకున్నారు. సందేశ్ఖలీ ఘటనపై కోర్టు పర్యవేక్షణలో గానీ, సిబిఐతో గానీ, సిట్తో గానీ విచారణ జరిపించాలని దాఖలైన పిల్ను పరిశీలించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది.