కొంత మంది బానిసత్వంతో మరికొంత మందికి పరిశుభ్రత సాధించలేం : బాంబే హైకోర్టు

ముంబయి : పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన ఒక కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సంక్షేమ రాజ్యంలో కొంత మందిని బానిసత్వంలో నిమగం చేయడం ద్వారా మరికొంత మందికి పరిశుభ్రత సాధించలేమని పేర్కొంది. 580 మంది మున్సిపల్‌ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి, వారికి అన్ని ప్రయోజనాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముంబయి మున్సిపల్‌ విభాగంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తోన్న 580 మంది తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలని కోరుతూ అక్కడి వర్కర్స్‌ యూనియన్‌ కోర్టును ఆశ్రయించాయి. రోడ్లను ఊడ్చటం, చెత్త సేకరణ వంటి పనులు నిర్వర్తించే వీరికి శాశ్వత పోస్టులు సృష్టించాలంటూ ఇండిస్టియల్‌ ట్రైబ్యునల్‌ గతంలో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ ముంబయి హైకోర్టులో సవాలు చేసింది. ఈ పిటీషన్‌ను విచారిస్తూ జస్టిస్‌ మిలింద్‌ జాధవ్‌ ఏకసభ్య ధర్మాసనంపై వ్యాఖ్యలు చేసింది. ‘స్వచ్ఛమైన వాతావరణనేది పౌరుల ప్రాథమిక హక్కు. కానీ కార్మికుల మానవ గౌరవాన్ని కాలరాయడం ద్వారా దాన్ని సాధించలేం’ అని పేర్కొంటూ తీర్పు చెప్పింది. ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును కొట్టివేయడమనేది ‘న్యాయాన్ని అపహాస్యం’ చేసినట్లే అవుతుందని కూడా స్పష్టం చేసింది. దీంతో నవంబర్‌ 2023లో ఇచ్చిన తీర్పు తాజాగా అందుబాటులోకి వచ్చింది.

➡️