దూడపై పెద్ద పులి దాడి

Feb 7,2024 08:23 #Animal attack, #Tiger

ప్రజాశక్తి – పోలవరం: ఆవు దూడపై పెద్ద పులి దాడి చేసి చంపిన ఘటన ఏలూరు జిల్లా పోలవరం మండలం ఉడతపల్లి గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాపికొండలు అభయారణ్యంలోకి వెళ్లిపోయిందనుకున్న పెద్దపులి ఏలూరు జిల్లాలో సంచరిస్తున్నట్లు గుర్తించారు. ఆవు దూడపై పులి దాడి చేసి చంపిందని మంగళవారం ఉదయం గుర్తించిన ఉడతపల్లి గ్రామ గిరిజనులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీ అధికారులు అక్కడికి చేరుకుని పులి అడుగుజాడలను గుర్తించారు. ఉడతపల్లి, గడ్డపల్లి పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకూ ఎవరూ బయట సంచరించ వద్దని ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ దావీదు రాజు హెచ్చరించారు. పగటి వేళలోనూ అడవిలోకి, వ్యవసాయ పనుల్లోకి ఒంటరిగా వెళ్లద్దని, గుంపులుగా వెళ్లాలని సూచించారు.

➡️