ఇసుక తోలిస్తే శవం వచ్చింది !

Apr 12,2024 21:55 #dead body, #sand

– బేస్‌మట్టాన్ని నింపుతుండగా బయటపడ్డ వికలాంగుడి మృతదేహం
ప్రజాశక్తి-చీరాల (బాపట్ల జిల్లా) :ఇంటి నిర్మాణం కోసం ఇసుకను తోలించుకుంటే మృతదేహం బయటపడింది. ఈ ఘటన బాపట్ల జిల్లా చీరాల మండలంలో సంచలనంగా మారింది. ఈ ఘటనపై ఇంటి యజమానురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురిపాలెం పద్మనాభునిపేటలో నివాసముంటున్న కె.రాంబాబు, లక్ష్మి దంపతులు నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇంటి బేస్‌మట్టం పూడ్చేందుకు పది ట్రక్కుల ఇసుక అవసరం కావడంతో ఇటీవల ఓ కాంట్రాక్టర్‌ను సంప్రదించారు. సదరు కాంట్రాక్టర్‌ బోయినవారిపాలెం గ్రామ శివారులోని సమాధుల వద్ద ఇసుకను అక్రమంగా జెసిబి ద్వారా తవ్వి ఇసుకను సరఫరా చేశారు. శుక్రవారం ఉదయం జెసిబి, కూలీలతో బేస్‌మట్టం పూడ్చితున్న సమయంలో ఒక్కసారిగా ఇసుకలోనుంచి తల లేని మృతదేహం బయటపడింది. దీంతో భయభ్రాంతులకు గురైన కూలీలు ఈ విషయాన్ని ఇంటి యజమాని లక్ష్మికి తెలిపారు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించారు. జెసిబితో ఇసుక తరలించే క్రమంలో తల తెగిపోయి ఉండవచ్చని, బయటపడ్డ మృతదేహం ఓ వికలాంగుడిదిగా పోలీసులు గుర్తించారు. ఆయన ఇటీవలే చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం ఎక్కడిది? ఎక్కడి నుంచి ఇసుక తరలించారు? అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈపురిపాలెం ఎస్సై శివశంకర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️