ప్రజాశక్తి-భట్టిప్రోలు (బాపట్ల) : విధి నిర్వహణలో భాగంగా కాశ్మీర్ లోయలో పడి మృతి చెందిన ఆర్మీ ఉద్యోగి పప్పల శ్రీరాములు అంతిమయాత్ర బాపట్ల జిలా భట్టిప్రోలు మండలం ఐలవరం గ్రామంలో మంగళవారం నిర్వహించారు. శ్రీరాములు గత పదేళ్ల క్రితం ఆర్మీలో చేరారు. ప్రస్తుతం చండీగఢ్ మంచు పర్వతాల్లో విధులు నిర్వహిస్తుండగా గత నెల 27న జారి లోయలో పడిపోయారు. తోటిసైనికులు గమనించి శ్రీరాములను వైద్య చికిత్స నిమిత్తం వైద్య శాలలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సోమవారం రాత్రికి చెరుకుపల్లికి తరలించారు. మంగళవారం గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. శ్రీరాములు భౌతికకాయాన్ని ఆర్మీ సిబ్బంది, గ్రామస్తులు, వైసిపి వేమూరు నియోజకవర్గ వైసిపి ఇన్ఛార్జి వరికూటి అశోక్ బాబు, గ్రామ సర్పంచి మాచర్ల కోటేశ్వరరావు సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.