– 96.30 శాతం హాజరు
– 10న ప్రాథమిక కీ విడుదల
ప్రజాశక్తి-అనంతపురం :ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి, అనంతపురం జెఎన్టియు సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఎపి ఇసెట్-2024 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో 93, హైదరాబాద్లో రెండు కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించారు. 37,767 మంది దరఖాస్తు చేసుకోగా 36,369 మంది పరీక్షకు హాజరయ్యారు. ఎపిలో 96.42 శాతం, హైదరాబాద్లో 93.32 శాతం హాజరు నమోదయ్యింది. అందరి సహకారంతో రాష్ట్ర ఇసెట్ పరీక్షను విజయవంతంగా నిర్వహించామని ఎపి ఇసెట్ కన్వీనర్ పిఅర్ భానుమూర్తి తెలిపారు. 10వ తేదీన ఎపి.ఇసెట్ వెబ్సైట్లో ప్రాథమిక ‘కీ’ని అందుబాటులో ఉంచుతామన్నారు. ‘కీ’లో ఏమైనా తప్పులుంటే 12వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు విద్యార్థులు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ పరీక్షా కేంద్రాన్ని జెఎన్టియు ఉపకులపతి జివిఆర్ శ్రీనివాసరావు, ఇసెట్ కన్వీనర్ పిఆర్ భానుమూర్తి తనిఖీ చేశారు.