రాప్తాడు (అనంతపురం) : గత ఆదివారం రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో పాత్రికేయులు శ్రీకృష్ణ, అనిల్ పై వైసీపీ గుండాల దాడిని ఎస్ఎఫ్ఐ, టిఎన్ఎస్ఎఫ్ ఎస్కే యూనివర్సిటీ నాయకులు ఖండించారు. మంగళవారం ఉదయం ఎస్కే యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు తరిమెల గిరి, సహాయ కార్యదర్శి అశోక్, యూనివర్సిటీ కార్యదర్శి వంశి, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు మనోహర్ మాట్లాడుతూ… రాప్తాడు సిద్ధం సభలో వైసిపి గుండాలు దాడి చేసినప్పటికీ పోలీసు యంత్రాంగం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ దేశాన్ని మోస్తున్న నాలుగవ పిల్లర్ మీడియా అని, అలాంటి మీడియా పాత్రికేయులపై అమానవీయంగా దాడి చేయడం వైసీపీ ప్రభుత్వ అరాచకానికి నిదర్శనమన్నారు. ఈ దాడి పూర్తిగా ప్రజాస్వామ్యం మీద జరిపిన దాడిగా అభిప్రాయపడ్డారు. పాత్రికేయుని మీద దాడి జరిగిన ఇంతవరకు వైసీపీ ప్రభుత్వం, వైసిపి అధికార నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించకపోవడం శోచనీయమన్నారు. సోషల్ మీడియాలో ఏబీఎన్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ మీద దాడి చేస్తున్న విజువల్స్ ప్రచారంలో ఉన్నాయని, స్థానికంగా ఉన్న ప్రజలే దాడి చేసిన గూండాలను గుర్తు పడుతున్నారని కానీ పోలీసు వ్యవస్థ మాత్రం గూండాలను గుర్తుపట్టకపోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఇప్పటివరకు దాడి చేసిన వారిని అరెస్టు చేయకపోవడం కనీసం స్పందించకపోవడం వారి పనితీరు ఏ విధంగా ఉన్నదో అర్థమవుతుందని అన్నారు. పాత్రికేయుల మీద దాడి చేయడం ప్రజాస్వామ్యం పై దాడి చేయడమని ఈ దాడిని వైసిపి పార్టీ నైతిక బాధ్యత వహించాలని, తక్షణమే దాడి చేసిన వారిని అరెస్టు చేసి కేసులు నమోదు చేయాలని పోలీసు యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే భవిష్యత్తులో విద్యార్థి సంఘాలుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ నాయకులు మోహన్, చంద్ర నాయక్, మంజు, సండే, బండేశ్ తిరుపాలు, లోకేశ్వర్ రెడ్డి, చంద్ర, రాజు, సుమన్, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.