ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించిన డీసెట్-2024 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. డీసెట్ కన్వీనర్, పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టరు మేరీ చంద్రిక ఈ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,949 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా, 3,191 మంది ఉత్తీర్ణత సాధించారు. మేథమెటిక్స్ విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన బులుసు గ్రీష్మిత, ఫిజికల్ సైన్స్లో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కేసన మీనాక్షి, బయలాజికల్ సైన్స్ విభాగంలో కడప జిల్లాకు చెందిన షేక్ రుక్సాన, సాంఘిక శాస్త్ర విభాగంలో చిత్తూరు జిల్లాకు చెందిన గుత్తా సునీల్కుమార్ మొదటి ర్యాంకు సాధించారు. జూన్ 6 నుంచి 8వ తేదీ వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని చంద్రిక తెలిపారు. జూన్ 20 నుంచి కోర్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/04/10th-exams.jpg)