ప్రజాశక్తి-తిరుమల : టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుమల ఆస్థాన మండపంలో ధార్మిక సదస్సు ప్రారంభమైంది. టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సు సోమవారం ముగియనుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరయ్యారు. అంతకు ముందు తిరుమల శ్రీవారిని చినజీయర్ స్వామి, కుక్కే సుబ్రహ్మణ్య పీఠాధిపతి విద్యాప్రసన్న తీర్థులు, వ్యాసరాజ మఠం పీఠాధిపతి విద్యాతీర్థ స్వామి, సత్యానంద ఆశ్రమం శ్రీహరి తీర్థానంద స్వామి, విశ్వగురు ఆశ్రమం విశ్వయోగి స్వామి, కడప బ్రహ్మంగారి మఠం విరజానంద స్వామి తదితరులు దర్శించుకున్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.