ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : స్వయం సహాయక బృందాల సభ్యులను ప్రభావితం చేసే కార్యక్రమాలను నిర్వహించొద్దని సంబంధిత శాఖల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నంత వరకు స్వయం సహాయక బృందాల సభ్యులను వ్యక్తిగతంగా, సమిష్టిగా రాజకీయ కోణంలో అభిప్రాయానికి అనుగుణంగా లేదా వ్యతిరేకంగా ప్రభావితం చేసే ఏ విధమైన సమీకరణ, అవగాహన, సర్వే, ఇతర కార్యకలాపాలు నిర్వహించకూడదని పేర్కొన్నారు. నిబంధనల అమలు విషయంలో సెర్ప్ సిఇఒ, మెప్మా మిషన్ డైరెక్టరు ప్రత్యేక శ్రద్ధ, చొరవ చూపాలని ఆదేశించారు.