మెగా డీఎస్సీని వెంటనే ప్రకటించాలి – డివైఎఫ్ఐ రాస్తారోకో 

Jan 25,2024 15:36 #DYFI, #Protest, #SFI, #Vizianagaram
dyfi protest for mega DSC

నగరంలో భారీ ర్యాలీ 
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా గురజాడ లైబ్రరీవద్ద నుండి కోట జంక్షన్ వరకు రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంత కాలంగా ఎదురు చూస్తున్నా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ తక్షణ విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోట జంక్షన్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డి వై ఎఫ్ ఐ) జిల్లా అధ్యక్షులు సిహెచ్ హరీష్ మాట్లాడుతూ 2019 ఎన్నికల ముందు నిరుద్యోగులకు జగన్మోహన్ రెడ్డి ‘నేను ఉన్నాను నేను విన్నాను.. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటికీ నోటిఫికేషన్లు విడుదల చేస్తానని, అలాగే ప్రతి సంవత్సరం ఖాళీ అయ్యే ఉద్యోగాలతో కలిపి ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. 2018 డిఎస్సీ తర్వాత ఇప్పటివరకు ఒక్క డీఎస్సీ అంటే ఒక్క డీఎస్సీ కూడా విడుదల చేయలేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు పేరుతో పనులు చేసి భారీగా విద్యార్థుల సంఖ్యను పెంచామని గొప్పలు చెప్పుకునే జగన్మోహన్ రెడ్డికి ఆ విద్యార్థులకు చదువు చెప్పడానికి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని ఆలోచన లేకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి పార్లమెంటులో కేంద్ర విద్యా శాఖ మంత్రి మాట్లాడుతూ 50,000 ఖాళీగా ఉన్నాయని ప్రకటిస్తే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒకరోజు 714 అని, మరో రోజు ఎనిమిది వేలు అని, ఇంకొక రోజు 69 అని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని నిరుద్యోగులు అంటే రాష్ట్ర మంత్రులకు హేళనగా ఉందన్నారు. బిఈడి టిటిసి చదువుకొని రాష్ట్రంలో పది లక్షల మంది పైబడి కోచింగ్ సెంటర్లు స్టడీ హాల్స్ లో మగ్గిపోతున్నారని వీరి బాధలు రాష్ట్ర ప్రభుత్వానికి పట్టవా అని ప్రశ్నించారు. తక్షణమే 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, మూతపడిన ప్రభుత్వ పరిశ్రమలను తెరిపించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని లేనిపక్షంలో జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సి వస్తుందని హెచ్చరించారు. అదేవిధంగా ఈనెల 27, 28 తేదీలలో విజయవాడ కేంద్రంలో రెండు రోజులపాటు జరుగు నిరాహారదీక్షలో నిరుద్యోగులు అందరూ పాల్గొని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో డి వై ఎఫ్ ఐ ఉపాధ్యక్షులు సతీష్, ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి రామ్మోహన్, ఎస్ఎఫ్ఐ నాయకులు, నిరుద్యోగ యువత వందల సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొన్నారు.

➡️