ఇడి వేధిస్తోంది..అందుకే రాజకీయాలకు గుడ్‌బై : ఎంపీ గల్లా జయదేవ్‌

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : ఇడి వేధింపుల వల్ల తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు గుంటూరు టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌ ప్రకటించారు. గుంటూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు, 2018లో బిజెపి ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టినందునకు వేధింపులు, వ్యాపారాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తనను లక్ష్యంగా పెట్టుకుని ఇడి దాడులు చేయించిందని చెప్పారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాలు వ్యాపారపరంగా తనను ఇబ్బంది పెట్టాయన్నారు. తన వ్యాపారాలన్నీ కేంద్ర నిఘా పరిధిలోనే ఉన్నాయని, సిబిఐ, ఇడి తన ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నాయని చెప్పారు. తాను తన వ్యాపారాల్లో బిజీగా ఉన్నందున రాజకీయాలకు సమయం కేటాయించలేకపోతున్నానని తెలిపారు. పదేళ్ల తర్వాత వ్యాపారాలను పిల్లలకు అప్పగించి తిరిగి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్టు చెప్పారు.

➡️