విద్యుదాఘాతానికి రైతు మృతి

ప్రజాశక్తి – రేగిడి (విజయనగరం జిల్లా) : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన విజయనగరం జిల్లా రేగిడి మండలంలో శనివారం చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలకొండ మండలం అంపిలి గ్రామానికి చెందిన రైతు వావిలపల్లి అప్పల నాయుడు (58) సంకిలి పంచాయతీలోని బొడ్డవలస గ్రామ సమీపంలోని తన వ్యవసాయ పొలం వద్దకు వేకువజామున నీళ్లు పెట్టేందుకు వెళ్లారు. మోటారు ఆన్‌ చేసేందుకు ప్రయత్నించగా అక్కడే వేలాడుతున్న విద్యుత్‌ వైరు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. పొలానికి నీరు రావడంలేదని గ్రహించిన తోటి రైతులు మోటార్‌ షెడ్డు వద్దకు వెళ్లి చూడగా అప్పలనాయుడు మృతి చెంది ఉన్నారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్‌ఐ రాజారావు తెలిపారు.

➡️