రైతన్నలకు రైతన్నలే సాయంగా.. అన్నదాతల గొప్పమనసు..!

Apr 16,2024 13:17 #Anantapur District, #farmers, #helps

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : రైతన్నలకు రైతన్నలే సాయంగా-అన్నదాతలు గొప్ప మనస్సును చాటుకున్నారు. మండలంలో నీరు లేక బోర్లలో నీరు అడుగంటిపోయి రైతన్నలంతా సాగు చేయలేక అవస్థలు పడుతుంటే … ఇద్దరు అన్నదాతలు ముందుకొచ్చారు. వారి బోరుబావుల్లోని నీటిని మండలంలోని రైతన్నల పొలాలకిచ్చి గొప్ప మనసు చాటుకున్నారు.

మండల కేంద్రమైన నార్పల మేజర్‌ పంచాయతీలో భూగర్భ జలాలు అడుగంటి పంచాయితీకి సంబంధించిన ఎనిమిది బోర్లలో నీళ్లు రావడం లేదు. దీంతో స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతుండటం గమనించిన హోటల్‌ తలారి సుబ్బయ్య, కాఫీ పొడి రాజులు అనే ఇద్దరు రైతులు తమ పొలాల్లో ఉన్న బోరు బావుల్లోని నీటిని పగలంతా గ్రామ ప్రజలకు తరలించి, మిగిలిన నీటితో రాత్రి పూట తమ పొలాల్లో సాగుచేసుకుంటున్నారు. రైతు సుబ్బయ్య వదులుతున్న నీళ్ళు మండల కేంద్రంలోని చైతన్య కాలనీ నుంచి కోటవీధిలో నివసిస్తున్న ప్రజల అవసరాలను తీరుస్తుంది. అదేవిధంగా కాఫీ పొడి రాజు అనే రైతు వదులుతున్న నీరు సుల్తాన్‌ పేట ప్రజల అవసరాలు తీరుస్తుంది. వారి పంటకు నీరు తక్కువైనా… పంచాయితీ బోర్లలో భూగర్భ జలాలు అడిగింటి నీరు రాకపోవడంతో గ్రామ ప్రజల ఇబ్బందులను గుర్తించి గ్రామ ప్రజలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో గొప్ప మనసుతో గ్రామ ప్రజల సౌకర్యార్థం నీటిని వదులుతుండడంతో పలువురు స్థానికులు, రైతులు కలిసి సుబ్బయ్య, రాజులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు.

➡️