పదో అంతస్తు పైనుండి దూకి తండ్రి ఆత్మహత్య

Apr 12,2024 09:38 #committed, #Father, #Suicide, #Telangana

రాజేంద్రనగర్‌ (తెలంగాణ) : కుమార్తె మానసిక వికలాంగురాలు, కుమారుడు ప్రయోజకుడు కాలేదని మనస్తాపం చెందిన తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం అత్తాపూర్‌ ఠాణా పరిధిలోని ఉప్పర్‌పల్లిలో జరిగింది.

ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రామిరెడ్డి వివరాల మేరకు … బేగంబజార్‌కు చెందిన దేవిదాస్‌ అగర్వాల్‌ (50) మూడేళ్ల కిందట రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ఉప్పర్‌పల్లికి వచ్చి కుటుంబంతో ఉంటున్నాడు. ఎల్‌ఐసి ఏజెంట్‌గా చేస్తున్నాడు. కుమార్తె మానసికంగా ఎదగలేదు. కుమారుడు మహాదేవ్‌కు ఇటీవల పెళ్లి చేయగా కిషన్‌బాగ్‌లో ఉంటూ.. క్యాబ్‌డ్రైవర్‌గా చేస్తున్నాడు. అతను ఇటీవల వాహనం తెచ్చుకుంటానంటే తండ్రి డబ్బులు ఇవ్వగా వాటిని దుర్వినియోగం చేయడంతో తండ్రి మనస్తాపం చెందాడు. ఇదే విషయంలో కుటుంబ సభ్యులతో కొన్ని రోజులుగా ఘర్షణ జరుగుతోంది. ఈ క్రమంలోనే గత గురువారం సాయంత్రం ఉప్పర్‌పల్లి ప్రధాన రహదారిపై ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌కు వెళ్లి అక్కడ కాపలదారుడిని అద్దెకు పోర్షన్‌ కావాలని అడిగాడు. అతడు పదో అంతస్తులో ఉందని చెప్పడంతో లిఫ్ట్‌లో అక్కడికి వెళ్లిన దేవిదాస్‌ అగర్వాల్‌ అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

➡️