బాబు, పవన్‌ రెచ్చగొట్టడం వల్లే సిఎంపై దాడి : ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌

Apr 21,2024 21:20 #coments, #MLA, #YCP

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ రెచ్చగొడుతూ చేసిన ప్రసంగాల వల్లే సిఎం జగన్‌పై దాడి చేసి, హత్యాయత్నానికి ప్రయత్నించారని వైసిపి ఎమ్మెల్యే ఎంఎ హఫీజ్‌ఖాన్‌ అన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమికి ఓటమి తప్పదనే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని దౌర్జన్యాలతో అడ్డదారుల్లో పోతోందని అన్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, ఇలాంటి విషం గక్కే ప్రసంగాలను ఎన్నికల కమిషన్‌ నియంత్రించాలని కోరారు. బిజెపితో కలిసి వెళ్తున్న టిడిపికి రాష్ట్రాభివృద్ధిపై చిత్తశుద్ధి వుంటే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై, ప్రత్యేక హోదాపై బిజెపితో ప్రకటన చేయించాలని డిమాండ్‌ చేశారు.

టిడిపి ఎన్‌ఆర్‌ఐ విభాగంపై చర్యలు తీసుకోండి : సిఇఒ మీనాకు వైసిపి ఫిర్యాదు
ఎన్నికల నిబంధనావళికి వ్యతిరేకంగా టిడిపి ఎన్‌ఆర్‌ఐ విభాగం వ్యవహరిస్తోందని, దానిపై చర్యలు తీసుకోవాలని వైసిపి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సిఇఒ ఎంకె మీనాను వైసిపి తరపున మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు, పార్టీ గ్రీవెన్స్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు నారాయణమూర్తి, లీగల్‌ సెల్‌ నాయకులు శ్రీనివాసరెడ్డి కలిసి ఫిర్యాదు చేశారు. టిడిపి ఎన్‌ఆర్‌ఐ విభాగం మంగళగిరిలోని వారి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కనీసం వెయ్యి మంది ఓటర్లను కొనుగోలు చేయాలని కన్వీనర్‌ కోమటి జయరామ్‌ మాట్లాడారని, ఈ అంశంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. సిఎం జగన్‌పై చంద్రబాబు, పురందేశ్వరి, పవన్‌కల్యాణ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

➡️