ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైౖర్మన్ డి ఆదినారాయణ, నాయకులు శ్రీనివాసరావు అన్నారు. స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు గురువారానికి 1190వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో స్టీల్ ఎంఎంఎస్ఎం, ఎస్టిఎం విభాగాల కార్మికులు కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టీల్ప్లాంట్ వల్లే విశాఖ ఇంతలా అభివృద్ధి చెందిందన్నారు. ప్లాంట్ చుట్టూ అనేక అనుబంధ పరిశ్రమలు ఏర్పడటంతో ఎంతో మందికి ఉపాధి లభించిందని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కేంద్రం కాలరాయాలని చూడటం సరికాదన్నారు. కార్మిక హక్కులను పరిరక్షించుకుంటేనే కార్మికవర్గం ఉన్నతంగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటేనే రిజర్వేషన్లు పటిష్టంగా అమలవుతాయని తెలిపారు.