ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం 61 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 173 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, బాప్ల, కోనసీమ, కృష్ణా, ఎన్టిఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది. ఇక సోమవారం నంద్యాల జిల్లా ఆత్మకూరులో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడప జిల్లా సింహాద్రిపురంలో 45.9, విజయనగరం జిల్లా రామభద్రపురంలో 45.1, కర్నూలు జిల్లా కోడుమూరులో 44.8, మన్యం జిల్లా సాలూరులో 44.5, శ్రీకాకుళం జిల్లా నర్సుపేటలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్ర వడగాడ్పుల నేపథ్యంలో వీలైనంత వరకు ప్రజలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్లలోనే ఉండాలని, ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని విపత్తుల సంస్థ ఎమ్డి కూర్మనాథ్ సూచించారు.