హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నీటిపారుదల రంగంపై శ్వేత పత్రాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దీనిపై సభలో చర్చ జరుగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పారు. కేసీఆర్ మంచి ఆరోగ్యంతో సంపూర్ణ జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. ప్రతిపక్ష నేతగా సభను సజావుగా నడపడానికి ఆయనకు పూర్తి స్థాయిలో శక్తిని కల్పించాలని కోరుతున్నానని చెప్పారు. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిగా, పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవంతో ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలకు ఆయన వచ్చి వివిధ అంశాలపై సలహాలు ఇవ్వాలని అన్నారు.