నాగర్ కర్నూల్ : బిఆర్ఎస్, కాంగ్రెస్ అనే రెండు విసుర్రాళ్ల మధ్య తెలంగాణ నలిగిపోయిందని ప్రధాని మోడి ఎద్దేవా చేశారు. శనివారం నాగర్ కర్నూల్ లో నిర్వహించిన బిజెపి బహిరంగ సభలో ప్రధానమంత్రి మోడి ప్రసంగిస్తూ … అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసింది బిజెపినేనని అన్నారు. బడుగు బలహీనవర్గాలకు ఎంతో మేలు జరిగిందన్నారు. కేంద్ర పథకాలతో అట్టడుగు వర్గాలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఆదివాసి మహిళను రాష్ట్రపతిని చేశామని మోడి అన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామని అంబేద్కర్ను కెసిఆర్ అవమానించారని ఆరోపించారు. కాంగ్రెస్ 2 జి స్కాం చేస్తే .. బిఆర్ఎస్ ప్రాజెక్టుల పేరుతో దోచుకుందన్నారు. అవినీతిపరులు ఎవరూ తప్పించుకోలేరు అని అన్నారు. మూడోసారి బిజెపి గెలవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోడి తెలిపారు. బిఆర్ఎస్ పట్ల ప్రజలు తమ కోపాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో చూపారని చెప్పారు. పదేళ్లుగా బిఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణ ప్రజల కలలను చిదిమేశాయని… ఇన్నేళ్లు బిఆర్ఎస్ అవినీతికి పాల్పడితే ఇప్పుడు తమ వంతు వచ్చిందని కాంగ్రెస్ భావిస్తోందన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ అనే రెండు విసుర్రాళ్ల మధ్య తెలంగాణ నలిగిపోయిందన్నారు. తెలంగాణను నాశనం చేసేందుకు కాంగ్రెస్కు ఈ ఐదేళ్లు చాలు అని మోడి విమర్శించారు.