- నేడు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం
- బుధవారం అసెంబ్లీకి 1,294, లోక్సభకు 237 సెట్ల నామినేషన్లు దాఖలు
ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఇవాళ్టితో ముగియనున్న విషయం తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణకు డెడ్లైన్గా అధికారులు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటివరకు అసెంబ్లీకి 3,644, లోక్సభకు 654 నామినేషన్లు దాఖలు అయ్యాయి.. బుధవారం ఒక్కరోజే అసెంబ్లీకి 1,294, లోక్సభకు 237 సెట్ల నామినేషన్లు దాఖలు కావడం విశేషం.. ఇక, ఇవాళ్టితో నామినేషన్ల స్వీకరణ ముగియనుండడంతో.. ఇవాళ పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉండటంతో.. అధికారులు దానికి తగ్గ ఏర్పాట్లు చేశారు. ఈ రోజు నామినేషన్లు వేసేందుకు సీఎం వైఎస్ జగన్తో పాటు.. మరికొందరు కీలక అభ్యర్థులు సిద్ధమయ్యారు.
అలాగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఇప్పటి వరకు మొత్తం 478 మంది అభ్యర్థులు, 554 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.. ఇక, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కూడా జరుగుతోన్న నేపథ్యంలో.. ఇప్పటికే ఆ స్థానంలో 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు.