నేటితో మూగబోనున్న పార్టీ ప్రచార మైకులు..!

అమరావతి : రాష్ట్రంలో ఇంతవరకు జోరుగా సాగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారం నేటి (శనివారం) సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఏప్రిల్‌ 18వ తేదీన నోటిఫికేషన్‌ విడుదలైనప్పటి నుంచి ఎన్నికల ప్రచారంతో రాజకీయ పార్టీల మైకులు ఎపిని హోరెత్తించాయి. మే 13న జరిగే పోలింగ్‌కు 48 గంటల ముందు ఎలాంటి ప్రచారం లేకుండా నిశ్శబ్ద కాలం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి సర్వేలు, ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రచురించడం, ప్రసారం చేయకూడదు. అందువల్ల ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రచార హోరు నిశ్శబ్దమవుతుంది.

సైలెంట్‌ పీరియడ్‌ …
పోలింగ్‌ ప్రక్రియ దగ్గరపడటంతో … వచ్చే 72 గంటల్లో అధికారులు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేబ్‌కుమార్‌మీనా ఆదేశాలు జారీ చేశారు. హింసకు, రీ పోలింగ్‌కు తావు లేకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలను మీనా ఆదేశించారు. ఆ ఆదేశాల్లో పేర్కొన్న ప్రకారం…. 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి పోలింగ్‌ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుండి నిశ్శబ్ద కాలం (సైలెంట్‌ పీరియడ్‌) అమల్లోకి వస్తుంది. ఆ సమయంలో ఎన్నికల ప్రచారానికి పూర్తిగా తెరపడుతుంది.

48 గంటల వ్యవధిలో…
చట్టవిరుద్ధమైన సమావేశాలపై నిషేధం ఉంటుంది. పోలింగ్‌ ముగింపు సమయం ఆధారంగా మద్యం దుకాణాలకు 48 గంటల డ్రై డే సవరించబడుతుంది. నియోజకవర్గం బయటి నుంచి ప్రచారం నిమిత్తం తీసుకువచ్చిన, నియోజకవర్గ ఓటర్లు కాని రాజకీయ కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు అంతా ప్రచార సమయం ముగిసిన వెంటనే నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలి. 48 గంటల వ్యవధిలో ఓటర్లు కాని ఇతర వ్యక్తులు స్థానిక లాడ్జిలు, కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు మొదలైన వాటిలో లేరని అధికారులు నిర్ధారించుకోవాలి.

ఏజెంట్ల జాబితా ఇవ్వాల్సిన అవసరం లేదు…
పోలింగ్‌ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్‌ ఏజెంట్ల నియామక జాబితాను రిటర్నింగ్‌ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పోలింగ్‌ తేదీ రోజు ప్రిసైడింగ్‌ అధికారికి పోలింగ్‌ ఏజెంట్‌ తమ వివరాలు సమర్పించి విధులకు హాజరు కావచ్చు.

➡️