రాజధానిపై బిజెపి అసలు నాటకం బయటపడింది

Apr 14,2024 08:28 #AP Capital, #CPM State Committee, #RBI

-ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి
సిపిఎం రాష్ట్ర కమిటీ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాజధానిపై బిజెపి అసలు నాటకం బయటపడిందని సిపిఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి వి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రిజర్వుబ్యాంకు ప్రాంతీయ కార్యాలయం విశాఖలో ఏర్పాటు చేయడానికి 2022లో నిర్ణయం జరిగినా తాత్సారం చేసిన ఆర్‌బిఐ ఇప్పుడు తాజాగా రాజధాని ఎక్కడో తేల్చాకే నిర్ణయిస్తామని పేర్కొనడం రాష్ట్రప్రజల్ని మోసం చేయడం, అవమానపర్చడమేనని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అని గతంలోనే కేంద్రప్రభుత్వం గెజిట్‌లో నోటిఫై చేయడమే కాక పార్లమెంటులో పలుమార్లు తెలిపిందని గుర్తుచేశారు. అయినా ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటుకు దాన్ని ఒక షరతుగా పేర్కొనడం అసంబద్దమని తెలిపారు. మూడు రాజధానుల పేరుతో వైసిపి ప్రభుత్వం చేసిన గందరగోళాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏనాడు వ్యతిరేకించలేదని విమర్శించారు. పైపెచ్చు రాష్ట్రప్రభుత్వం ఇష్టమన్న రీతిలో హైకోర్టులో అఫిడవిట్‌ కూడా దాఖలు చేసిందని తెలిపారు. రాజధాని అమరావతికి పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు మోడీ గుమ్మరించి పోయారని విమర్శించారు. అనాటి నుంచి అస్పష్టత కొనసాగడంతో బిజెపి దొంగనాటకాలు ఆడుతూనే ఉందని తెలిపారు. ఇప్పటికైనా వాటికి తెరదించి రాష్ట్రంలో ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసేటట్లు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️