– అవినాష్పై పులివెందుల కౌన్సిలర్లు, వైసిపి నాయకుల అసంతృప్తి
ప్రజాశక్తి-పులివెందుల టౌన్ :వైఎస్ఆర్ జిల్లా పులివెందుల పట్టణంలో పనులు చేసిన వాటికి బిల్లులు మంజూరు కాలేదని, ఆ డబ్బులు ఎవరు ఇస్తారని, పార్టీ కోసం పనిచేసి నష్టపోయామని పులివెందుల కౌన్సిలర్లు, వైసిపి నాయకులు కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్రెడ్డిని ప్రశ్నించారు. కౌన్సిలర్లతో పాటు వైసిపి ముఖ్య నేతలతో ఎంపి అవినాష్ శనివారం సమావేశం నిర్వహించారు. కొంత కాలంగా కౌన్సిలర్లు పార్టీపై అసమ్మతితో ఉన్నారనే సమాచారంతో ఆయన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా పాడా నిధులతో చేసిన పనులలో సుమారు రూ.250 కోట్ల నిధులు నిలిచిపోవడం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుసుకున్న అవినాష్రెడ్డి కౌన్సిలర్లను సముదాయించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం బిల్లులు మంజూరు చేసే వరకు వేచి చూద్దామని, అవసరమైతే కోర్టును ఆశ్రయిద్దామని అవినాష్ సర్ది చెప్పారు. గెలుపు, ఓటములు సహజమేనని నిరుత్సాహపడకుండా ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్దామని సూచించారు. మనందరికీ జగన్ అండగా ఉన్నారని పార్టీని అంటిపెట్టుకుని ఉండాలని కౌన్సిలర్లను కోరారు. కార్యక్రమంలో వైఎస్.మనోహర్రెడ్డి, వైఎస్.మదన్ మోహన్రెడ్డి, కౌన్సిలర్లు, వైసిపి ముఖ్య నేతలు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/9-26.jpg)