ప్రజాశక్తి-కడియం (తూర్పుగోదావరి) : రాప్తాడులో జరిగిన వైసిపి సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీ కృష్ణపై జరిగిన దాడి దారుణమని, దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని మంగళవారం కడియంలో జర్నలిస్టులు డిమాండ్ చేశారు. దీనిపై కడియం సిఐ బి.తులసీధర్, తహశీల్దార్ కార్యాలయ డి.టి జనార్ధన్కు వినతి పత్రాలు అందజేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సభకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఫోటోగ్రాఫర్ పై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరచడం అన్యాయమని దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేవారు ఎలాంటి వారైనా ప్రజా కోర్టులో నిలబడాల్సిందేనని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడి పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన పలువురు పాత్రికేయులు ఉన్నారు.