లక్నో : ఎన్నికల వేళ చిత్ర, విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి. నామినేషన్ దాఖలుకు గడువు ముగుస్తుండడంతో ఓ బిజెపి అభ్యర్థి పరుగు పరుగున వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. డేరియా నియోజకవర్గానికి ఏడో దశ (జూన్ 1)లో పోలింగ్ జరగనుంది. ఇక్కడి నుంచి బిజెపి అభ్యర్థిగా శశాంక్ మణి త్రిపాఠి గురువారం నామినేషన్ వేశారు. ఆయన తన నియోజకవర్గ ప్రజలతో కలిసి కోలాహలంగా నామినేషన్ వేస్తే వార్తల్లో నిలిచేవారు కాదేమో! ఆయన ప్రచారంలో బిజీగా ఉండి.. గడువు లోపే నామినేషన్ వేద్దామని.. సమయం పావుగంట ఉండటంతో రోడ్డుపై పరుగిత్తుకుంటూ వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన రోడ్డుపై పరుగెత్తుకుంటూ వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై త్రిపాఠి మాట్లాడుతూ.. ‘నేను కాలేజీ రోజుల్లో మంచి రన్నర్గా పేరు తెచ్చుకున్నాను. అది ఇప్పుడు ఇలా కలిసి రావడం విశేషం.’ అన్నారు.