ఎన్నికలు ముగిసే వరకు ఐజాక్‌ జోలికెళ్ళొద్దు

Apr 10,2024 23:48 #ED, #high court, #kerala
  • ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు కేరళ హైకోర్టు ఆదేశం

తిరువనంతపురం : పతనాంతిట్ట లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కేరళ మాజీ ఆర్థిక మంత్రి థామస్‌ ఐజాక్‌ను ఫెమా ఉల్లంఘనల కేసులో ప్రశ్నించేందుకు లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యేవరకు పిలవవద్దని కేరళ హైకోర్టు మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి)ని కోరింది. కెఐఐఎఫ్‌బి జారీ చేసిన మసాలా బాండ్‌ విషయంలో విదేశీ మారక ద్రవ్య నిర్వహణా చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించారన్న కేసు ఆయనపై నమోదైంది. ఐజాక్‌ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు వచ్చినప్పుడు జస్టిస్‌ టి.ఆర్‌.రవి మాట్లాడుతూ, పిటిషనర్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున, ఇవి ముగిసేవరకు ఆయనకు సమన్లు జారీ చేసి ఇబ్బంది పెట్టొద్దని ఇడిని హెచ్చరించారు. ఇడి అందచేసిన ఫైళ్ళను కోర్టు పరిశీలించిన అనంతరం న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. మసాలా బాండ్‌ ద్వారా అందిన నిధుల లావాదేవీల్లో కొన్నింటికి ఐజాక్‌ వివరణ ఇవ్వాల్సిన అవసరం వుందని కోర్టు పేర్కొంది. అయితే ఈ దశలో ఆ లావాదేవీల ఆదేశాలు వెల్లడించడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ వివరాలను దర్యాప్తును ఎదుర్కొంటున్న వ్యక్తికి అందచేయాల్సి వుంటుందని పేర్కొంది. ఈ లావాదేవీలపై దర్యాప్తు నిర్వహించాలంటే ఎన్నికలు ముగిసిన తర్వాత చేపట్టాలని కోర్టు స్పష్టం చేసింది. ఐజాక్‌కు ఎప్పుడు వీలుంటే ఆ తేదీల్లోనే తమ ముందు హాజరు కావాల్సిందిగా కోరామని ఇడి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై మే 22న తదుపరి విచారణకు కోర్టు వాయిదా వేసింది. కఐఐఎఫ్‌బి వైస్‌ ఛైర్మన్‌గా, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఛైర్మన్‌గా తన పదవీ కాలంలో మసాలా బాండ్‌ ద్వారా అందిన నిధుల వినియోగంపై మౌఖిక సాక్ష్యమివ్వడానికి ఇడి ముందుకు హాజరు కావాల్సిందిగా తనకు సమన్లు జారీ చేశారని ఐజాక్‌ పేర్కొన్నారు. కానీ తాజా సమన్ల వెనుక గల ఏకైక ఉద్దేశం తన ఎన్నికల ప్రచారానికి అవరోధం కలిగించడమేనని అన్నారు.

➡️