ఘోర ప్రమాదం – నీరున్న గొయ్యిలో పడి ఆరుగురు మృతి

కాన్పూర్‌ దెహాత్‌ (ఉత్తరప్రదేశ్‌) : ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం కాన్పూర్‌ దెహాత్‌ జిల్లా సికంద్రా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జగన్నాథ్‌ పూర్‌ గ్రామ సమీపంలో వర్షం కురుస్తుండగా, వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి నీరున్న గొయ్యిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. కాగా, కారులో మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని.. జెసిబి సహాయంతో కారును బయటకు తీశారు. ఇక, ప్రమాదంలో గాయపడిన ఇద్దరు చిన్నారులను స్థానిక ఆస్పత్రిలో చికిత్స కోసం పంపించారు. ఆరుగురి మృదేహాలను పోలీసులు శవ పరీక్షల కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా సమయంలో జోరుగా వర్షం కురుస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కారు అదుపు తప్పడం వల్లే ఈ ఘటన జరిగినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

➡️