చెన్నై : లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిఎంకెతో సీట్ల సర్దుబాటు విషయంపై శనివారం చర్చలు జరపనుంది. తమిళనాడు, పుదురుచ్చేరిలో 10 సీట్లకు పోటీ చేసే విషయంపై తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టిఎన్సిసి) డిఎంకెతో ఒప్పందం కుదుర్చునే అవకాశం ఉంది. తమిళనాడులో 9 సీట్లు, పుదుచ్చేరిలో ఒకసీటుకు సంబంధించిన విషయంపై కాంగ్రెస్ డిఎంకె కూటమితో చర్చలు జరపనుంది. ఈరోజు సాయంత్రం నాలుగు గంటల సయంలో ఇరు పార్టీల నేతలు సీట్ల సర్దుబాటుపై చర్చించి, ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ ఏయే నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే దానిపై ఇంకా ఖరారు కాలేదు.
డిఎంకె కూటమితో సీట్ల సర్దుబాటుపై తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె. సెల్వపెరుంతగై మీడియాతో మాట్లాడుతూ.. ‘మా కూటమి అభ్యర్థుల కోసం రాహుల్ గాంధీ, సోనియాగాంధీలు కూడా ప్రచారం చేస్తారు.’ అని ఆయన అన్నారు. ఇక ఈ సందర్భంగా చేయి గుర్తుపై మక్కల్ నీతి మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్ పోటీ చేయనున్నారా అని మీడియా సెల్వపెరుంతగైని ప్రశ్నించగా.. అటువంటిదేమీ లేదని ఆ ప్రశ్నను ఆయన తోసిపుచ్చారు.
రెండు వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎంలకు రెండు, రెండు సీట్లు చొప్పున మొత్తం నాలుగు సీట్లను డిఎంకె కేటాయించింది. ఇక ఎండిఎంకెకు ఒకసీటు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్), కెంఎడికెకు ఒక సీటు చొప్పున కేటాయించింది.