- కేరళలో కాంగ్రెస్ తీరుపై ఏచూరి
తిరువనంతపురం : కేరళలో పరోక్షంగా బిజెపికి సహకరిస్తూ వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్డిఎఫ్)ను, అందునా ముఖ్యమంత్రి పినరయి విజయన్ను కాంగ్రెస్ వ్యక్తిగతంగా టార్గెట్గా చేసుకోవడం సరికాదని సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.. కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన శనివారం అలప్పుజలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బిజెపిని ఓడించే ప్రధాన లక్ష్యంతో కాంగ్రెస్, సిపిఎం ఇతర ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ‘ఇండియా’ బ్లాక్ను ఏర్పాటు చేసిన సంగతిని ఈ సందర్భంగా ఏచూరి గుర్తు చేశారు. అయితే కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) మాత్రం తన మొదటి టార్గెట్గా ఎల్డిఎఫ్ను చేసుకుందని విమర్శించారు. కాషాయ పార్టీని విడిచిపెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్పై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని, ఇది విస్మయకరమని ఏచూరి అన్నారు.
కొత్త కాంగ్రెస్గా బిజెపి
కేరళలో యుడిఎఫ్ నుంచి, అలాగే కాంగ్రెస్ నుంచి చాలా మంది నాయకులు బిజెపి పంచన చేరుతున్నారని ఏచూరి అన్నారు. దేశమంతటా ఈ ధోరణి ఉందని, ఇప్పుడు బిజెపిని ‘కొత్త కాంగ్రెస్’గా పిలుస్తున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ నుండి ఫిరాయించిన పలువురు నేతలను బిజెపి లోక్సభ ఎన్నికల బరిలో నిలిపిందని ఏచూరి పేర్కొన్నారు. ఈ విషయాన్ని అయినా గమనించి ఇప్పటికైనా కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని, తన ప్రధాన లక్ష్యాన్ని గుర్తించాలని ఏచూరి హితవు పలికారు. ‘కాంగ్రెస్ కూడా బిజెపి ప్రధాన లక్ష్యమైతే..అందరం కలిసి దానిని ఓడిద్దాం. కానీ కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం ఎల్డిఎఫ్, కేరళ ముఖ్యమంత్రి అయితే దానివల్ల బిజెపికి కాంగ్రెస్ మేలు చేసినట్లే అవుతుంది. ఇదేనా కాంగ్రెస్ చేయాలనుకున్న పోరాటం. ఇది చాలా విస్మయకరం’ అని ఏచూరి తప్పుబట్టారు.
రాహుల్కు ఆ విజ్ఞత కూడా లేదు..
పార్లమెంటు నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సస్పెండ్ చేసినప్పుడు ఆయన సస్పెన్షన్ను ఖండించిన మొదటి వ్యక్తి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కనీసం రాహుల్కు ఆ విజ్ఞత కూడా లేదా అని ఏచూరి ప్రశ్నించారు ‘ఢిల్లీ, జార్ఖండ్ ముఖ్యమంత్రులను అరెస్టు చేసినప్పుడు కేరళ సిఎంను ఎందుకు మినహాయించారని బిజెపిని రాహుల్ ప్రశ్నిస్తున్నారు? దీనర్థం ఏమిటి? యుడిఎఫ్కు చేవ ఉంటే ఎల్డిఎఫ్ విధానాలపై సహేతుక విమర్శలు చేయవచ్చు. కానీ ఇదేమిటి? ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం దుర్మార్గం. ముఖ్యమంత్రి విజయన్ కానీ, కేరళ వామపక్ష నాయకులు కానీ మహారాష్ట్ర, జమ్ముకాశ్మీర్లో అరెస్టులకు భయపడి బిజెపిలో చేరిన కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రులు లాంటి వారు కారని, ప్రజాపక్షాన నిలిచే సైద్ధాంతిక పోరాటశక్తులని ఏచూరి తెలిపారు. బిజెపికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో సిపిఎం నాయకత్వ పాత్ర పోషిస్తోందని, అందువల్ల బిజెపిని వదిలేసి ముఖ్యమంత్రి విజయన్ను లక్ష్యంగా ఎంచుకున్న కాంగ్రెస్ నేతృత్వ యుడిఎఫ్కు ఈ ఎన్నికల్లో పరాభవం తప్పదని ఆయన చెప్పారు. కేరళలో 2004 నాటి ఎన్నికల్లో 20 లోక్సభ స్థానాలకు 18 స్థానాలను ఎల్డిఎఫ్ కైవసం చేసుకుందని, ఈ దఫా కంటే అవే ఫలితాలు పునరావృతమవుతాయని ఏచూరి తెలిపారు.
ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదం
దేశంలో ఎన్నడూ లేనంతగా ప్రజాస్వామ్యం ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికలు భారత భవిష్యత్కు ఎంతో కీలకమని ఆయన అన్నారు. ‘బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారిపోతుంది. అసహన ఫాసిస్టు హిందూత్వ దేశంగా భారత్ మారిపోతుంది. భారతదేశాన్ని లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా పరిరక్షించాలని కోరుకునే వాళ్లంతా బిజెపిని అధికారంలోకి మళ్లీ రానీయకుండా చూడాలి. ఇందుకోసం ఐక్యంగా కృషి చేసి బిజెపిని, దాని మద్దతుదారులను ఓడించితీరాలి’ అని ఏచూరి పిలుపునిచ్చారు.
శక్తి తక్కువే..కానీ చిత్తశుద్ధి మెండు
వామపక్షాలు తక్కువ పోటీ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి కదా బిజెపిని ఎలా ఎదుర్కొంటారు అన్న ప్రశ్నకు ఏచూరి బదులిస్తూ ‘మేము తక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నా..బిజెపిని ఓడించాలన్న చిత్తశుద్ధి మెండుగా ఉంది’ అని అన్నారు. ‘సిపిఎం 60 స్థానాల్లో పోటీ చేస్తోంది. వామపక్షాలన్నీ కలిసి 100 లోపు స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపాయి. దేశాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడటంలో మాకు చిత్తశుద్ధి ఉంది. బిజెపికి వ్యతిరేకంగా నిలబడిన పార్టీల మధ్య పోటీ తగ్గించేందుకు కృషి చేస్తున్నాం.మా రాజకీయ పరిపక్వతకు ఇది నిదర్శనం’ అని ఏచూరి పేర్కొన్నారు. కాగా లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్లో త్రిపురలో భారీగా రిగ్గింగ్ జరిగిందని, ఇది ఆందోళనకరమని ఏచూరి తెలిపారు.