హనుమకొండ (తెలంగాణ) : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ … గురువారం పిసిసి నాయకుడు బత్తిని శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు హనుమకొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సిఎం రేవంత్ రెడ్డి రూ.2,500 కోట్లను కాంట్రాక్టర్లు, బిల్డర్ల వద్ద వసూలు చేసి ఢిల్లీకి పంపించారని కెటిఆర్ తప్పుడు ఆరోపణలు చేశారని, లోక్సభ ఎన్నికల తర్వాత బిజెపి లోకి వెళతారని అబద్ధాలు చెప్పి సిఎం స్థాయి ని తగ్గించేలా మాట్లాడారని, తద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళుతున్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కెటిఆర్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో హనుమకొండ పోలీసులు కెటిఆర్పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి హైదరాబాద్ బంజారాహిల్స్కు కేసును బదిలీ చేశారు.