రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేశారు

cpm vsr on ap budget 2024-25

ఎన్నికల ప్రసంగం చేసిన రాష్ట్ర ఆర్థికమంత్రి

ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌పై సిపిఎం రాష్ట్ర కమిటీ

ప్రత్యేక హోదా, రాజధానిపై మౌనముద్ర

పోలవరం నిర్వాసితుల ప్రస్తావన లేదు

వ్యవసాయానికి ప్రాధాన్యత తగ్గించారు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రసంగం ఎన్నికల ప్రసంగంలా ఉంది తప్ప రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం గురించి ఏమాత్రం లేదని, రాష్ట్ర వెనుకబాటుతనానికి ముసుగువేసి గొప్పలు చెప్పుకుందని సిపిఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఐదేళ్ల ప్రభుత్వ పథకాలను ఏకరువు పెట్టడం తప్ప రాష్ట్రానికి కీలకమైనటువంటి సమస్యల గురించి ప్రస్తావించకపోవడం దారుణమని పేర్కొన్నారు. ప్రత్యేకహోదా, రాజధాని నిర్మాణం వంటి ముఖ్యాంశాలపై బడ్జెట్‌ ప్రసంగం మౌనముద్ర వహించడం తగదని పోలవరం ప్రాజెక్టు గురించి పేర్కొన్నప్పటికీ సర్వస్వం కోల్పోతున్న నిర్వాసితుల గురించి ఒక్క పదం కూడా లేకపోవడం ఈ ప్రభుత్వం నిర్వాసితుల పట్ల, గిరిజనుల పట్ల ఎంత కక్షపూరితంగా ఉందో అర్థమవుతోందని తెలిపారు. ఆశా, వివోఏ, వంటి మహిళా శ్రామికుల వేతనాలు పెంచామని ప్రభుత్వం గొప్పగా చెప్పింది. కానీ అంగన్‌వాడీ, మున్సిపల్‌ కార్మికులు, సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులకు సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీకి నిర్దిష్ట ప్రతిపాదనేమీ బడ్జెట్‌లో చూపలేదని ఆయన విమర్శించారు. డ్వాక్రా మహిళల అప్పులు రద్దు చేసే ప్రతిపాదనేమీ లేదని, రాబోతున్న రోజుల్లోనైనా సానుభూతిగా పరిశీలిస్తామని ఒక్కమాట కూడా మంత్రి తన ప్రసంగంలో పేర్కొనలేదని తెలిపారు. పైపెచ్చు వచ్చే బడ్జెట్‌ కూడా తామే పెడతాం అని గొప్పలు చెబుతున్నారని, రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బిజెపితో వైసిపి షరీకయ్యిందనడానికి బడ్జెట్‌ ప్రసంగం ఓ నిదర్శనమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మిగిలిన ఇతర సమస్యలనూ త్వరలో పరిష్కారం లభించబోతోందని చెప్పడం ద్వారా రానున్న రోజుల్లో బిజెపితో వైసిపి చెట్టపట్టాలేసుకునే వెళ్తుందని స్పష్టమవుతోందని విమర్శించారు. ఈ కారణంగానే ప్రత్యేకహోదా విషయంలోనూ, రాష్ట్రానికి కీలకమైన పోలవరం నిధులు, ముఖ్యంగా నిర్వాసితులకు సంబంధించి పునరావాసం వాటి విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడగలేకపోతోందని విమర్శించారు. విశాఖ ఉక్కు, రైల్వే జోన్‌, కడప ఉక్కు వంటి విషయంలోనూ అదే వైఖరి అవలంభించడం రాబోతున్న రోజుల్లో నూ కూడా అదే కొనసాగుతుందని అర్థమవుతుందని పేర్కొన్నారు. కీలకమైన వ్యవసాయ రంగం గురించి బడ్జెట్‌ ప్రసంగంలో నాలుగో చాప్టర్‌లో పేర్కొనడంలోనే ఈ ప్రభుత్వం వ్యవసాయానికి ఇస్తున్న ప్రాధాన్యత బోధపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక ధరల స్థిరీకరణ నిధిని మూడు వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశామని చెప్పారే తప్ప ఎంత ఖర్చు చేసింది చెప్పలేదని, దీంతో ఆ ధరల స్థిరీకరణ నిధి ఉట్టి మాటే అని స్పష్టమవుతోందని విమర్శించారు. ఆర్‌బికెల ద్వారానే సర్వస్వం అంటున్న ప్రభుత్వం ఏ పంటకూ మద్దతు ధర చెల్లించడం లేదు సరికదా ముఖ్యమైన ధాన్యం కొనుగోలు కూడా మిల్లర్ల ఇష్టారాజ్యమే సాగుతోంది తప్ప ప్రభుత్వం కంట్రోలు ఏమాత్రం లేదన్నది ఇప్పటికే రైతులకు బోధపడినటువంటి సత్యమని వివరించారు. తమ భూములపై రీసర్వే పేరిట ఎవరెవరికో బదలాయింపు చేయిస్తున్నారని రైతులు ఒకవైపు గగ్గోలు పెడుతున్నారని, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు సహజ న్యాయ సూత్రాలకు విరుద్దంగా ఉందని న్యాయవాదులు రాష్ట్రవ్యాపితంగా ఆందోళనలు చేస్తున్నారని పేర్కొన్నారు. అయినా ఆర్థిక మంత్రి ఈ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ని ఘనంగా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. మరోవైపు పేదలవద్ద ఉన్న భూములను గుంజుకుని సంపన్నులకు కట్టబెట్టడానికి అసైన్డ్‌చట్టసవరణ చేసిన ప్రభుత్వం బడ్జెట్‌ ప్రసంగంలో దళితులకు, పేదలకు భూములు ఇచ్చేశామని చెప్పడం అన్యాయమని విమర్శించారు. రాష్ట్రంలో తలసరి విద్యుత్‌ వినియోగం 2019-20లో 1203 యూనిట్లు ఉందని, 2023 డిసెంబర్‌ నాటికి 1400 యూనిట్లకు పెరిగిందని గొప్పలు చెప్పినటువంటి ఆర్థిక మంత్రి ఈకాలంలో విద్యుత్‌ ఛార్జీలను ఎంతలా పెంచిందీ, ట్రూఅప్‌, ఎఫ్‌టిపిసిఏ పేరిట దొంగదెబ్బ ఎలా తీసింది ఒక్క ముక్క కూడా చెప్పకపోవడం దారుణమని తెలిపారు. అదానీ పవర్‌ని సెకీ ద్వారా చేసుకున్నటువంటి ఒప్పందాన్ని గొప్పగా చెప్పుకొని ఈ రాష్ట్రంలో అన్ని రోజుల్లోనూ దాదాపు అందుబాటులో ఉండే సోలార్‌ పవర్‌ని రూఫ్‌టాఫ్‌ ద్వారా ట్యాప్‌ చేసుకోగలిగిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నాం అన్నటువంటి ఒక్క మాట కూడా ప్రస్తావించలేదని తెలిపారు. ఇల్లు కాదు, ఊళ్లే కట్టిస్తామని గొప్పగా చెప్పిన ప్రభుత్వం ఈ కాలంలో 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చామని, 22 లక్షలకు పైగా ఇళ్లను ప్లాన్‌ చేశామని, వాటిలో 9 లక్షల ఇళ్లు పూర్తయిపోయాయని చెప్పినప్పటికీ వాస్తవ సంఖ్య మాత్రం ఈ జగనన్న కాలనీల్లో 1,62,538 మంది లబ్దిదారులు నివసిస్తున్నారు అని పేర్కొనడం, ఈ ఐదేళ్ల కాలంలో ఇళ్ల నిర్మాణం పట్ల ఎంత నిర్లక్ష్యం వహించిందో స్పష్టంగా అర్థమవుతోందని విమర్శించారు.

➡️