వనపర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం – ఐదుగురు మృతి

కొత్తకోట (వనపర్తి) : వనపర్తి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నాటకలోని బళ్లారి నుంచి 12మంది హైదరాబాద్‌కు వెళుతుండగా, దాదాపు తెల్లవారుజామున 3 గంటల సమయంలో కొత్తకోట పరిధి జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.

ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జవ్వడంతో అందులో చిక్కుకున్న చిన్నారుల మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు, ఎల్‌ అండ్‌ టీ సిబ్బంది గంటకుపైగా శ్రమించాల్సి వచ్చింది. గాయపడినవారందరినీ వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో అబ్దుల్‌ రహమాన్‌ (62), సలీమా జీ (85), చిన్నారులు బుస్రా (2), మరియా (5), వాసిర్‌ రవుత్‌ (7 నెలలు) ఉన్నారు. గాయపడిన వారిలో సమీరా (5), హుస్సేన్‌ (10), షఫీ, ఖదీరున్నీసా, హబీబ్‌, అలీ, షాజహాన్‌ బేగ్‌ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వారిలో అలీకి వనపర్తి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. డైవర్‌ నిద్రమత్తులో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️