మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం
– హైకోర్టు కీలక తీర్పు
ప్రజాశక్తి-అమరావతి :హైవే కిల్లర్గా పేరుపొందిన నరహంతక మున్నా ముఠాకు ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్పు చేసింది. ఈ మేరకు హైకోర్టు తీర్పు చెప్పింది. యావజ్జీవంలో భాగంగా 45 ఏళ్లు జైలుశిక్ష అనుభవించాలంది. ఈలోగా ముద్దాయిలకు ఏ విధమైన క్షమాభిక్ష పెట్టరాదని స్పష్టం చేసింది. రహదారులపై పెట్రోలింగ్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తీవ్ర ఆక్షేపణ బాధ్యత వహిస్తూ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
హైవేపై పట్టపగలు హత్యలకు పాల్పడేవారిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని తప్పు పట్టింది. పెట్రోలింగ్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు విక్టిమ్ పరిహార పథకం కింద బాధిత కుటుంబాలకు పరిహారం ఖరాలు చేసే విషయంలో ప్రకాశం జిల్లా న్యాయసేవాధికార సంస్థ చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు దుర్గాప్రసాదరావు, జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ శుక్రవారం తీర్పు చెప్పారు. ఒంగోలును కేంద్రంగా చేసుకుని ప్రధాన నిందితుడు అబ్దుల్ సమద్ అలియాస్ మున్నా ఆధ్వర్యంలో మరికొందరు ఇనుపలోడుతో ఇతర రాష్ట్రాలకు వెళుతున్న లారీలను లక్ష్యంగా చేసుకుని తనిఖీ అధికారుల అవతారం ఎత్తి దోపిడీలకు పాల్పడేవారు. లారీ డ్రైవర్, క్లీనర్లను తాడుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసేవారు. మృతదేహాలను గోనె సంచుల్లో కుక్కి పూడ్చిపెట్టేవారు. లారీని కనబడకుండా చేసేవారు. లారీల్లోని సరుకును దోచుకునేవారు. ఈ ముఠా 13 మందిని హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేల్చారు. ఒంగోలు 8వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు పలువురికి ఉరిశిక్ష, నలుగురికి యావజ్జీవం, ఒకరికి పదేళ్లు, ఇంకొకరికి ఏడేళ్ల శిక్షలు విధిస్తూ 2021న తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్ పిటిషన్లను హైకోర్టు విచారణ జరిపి పై విధంగా శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. తొమ్మిది మందికి విధించిన ఉరిశిక్షను యావజ్జీవంగా మార్పు చేసింది. కింది కోర్టు ఉరిశిక్ష విధించిన వారిలో ప్రధాన నిందితుడు మున్నా, షేక్ రియాజ్, బత్తుల సాల్మన్, ఏపూరి చిన వీరాస్వామి, సయ్యద్ హిదయతుల్లా ఇతరులు ఉన్నారు.