వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు ప్రశ్నిస్తే దాడులకు తెగబడతారా?

Jan 31,2024 12:32 #Achchennaidu, #Comments, #TDP, #YCP
  • పట్టపగలు ప్రజా సంపద లూఠీ చేస్తుంటే మేం చూస్తూ కూర్చోవాలా?
  • టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం

ప్రజాశక్తి-అమరావతి : తమ అవినీతి,అక్రమాలు ప్రశ్నించిన వారిపై కక్షసాధింపులకు పాల్పడటం సిఎం జగన్ కు, ఆ పార్టీ ఎమ్మెల్యేల వరకు దినచర్యగా మారిందని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలను ప్రశ్నించినవారిపై బహిరంగంగా దాడులకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఇసుక దందాను ఆధారాలతో సహా బట్టబయలు చేసినందుకే టీడీపీ నేత కంచేటి సాయిపై కక్షసాధింపులకు పాల్పడ్డారన్నారు. అతని అనుచరుడు రాము దుకాణంపై ఎమ్మెల్యే కుమారుడు కళ్యాణ్ దగ్గరుండి దాడి చేయించాడని.. సాయిపై దాడి చేస్తామంటూ వైసీపీ నేతలు బహిరంగంగా కర్రలు పట్టుకుని తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజా సంపద దోచుకోవటం ఏంటని ఎమ్మెల్యేని ప్రశ్నించటం తప్పా? ప్రకృతి వనరులు పట్టపగలే దోపిడి చేస్తుంటే మేం చూస్తూ కూర్చోవాలా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే శంకర్రావు కుమారుడు కళ్యాణ్ నియోజకవర్గంలో రౌడీ గ్యాంగ్ ని పెంచిపోషిస్తున్నారని.. ఆ గ్యాంగ్ తో సినీ ఫక్కీలో ప్రజలపై దాడులు, దౌర్జన్యాలు చేయిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కుమారుడి ఆగడాలు సీఎంకి, డీజీపీకి కనిపించటం లేదా? అని ప్రశ్నించారు. కంచేటి సాయికి భద్రత కల్పించాలని.. సాయికి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యతన్నారు.

➡️