ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల కేంద్రమైన నార్పలలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయం సమీపంలో ప్రసాదు, ఈశ్వరమ్మ అనే దంపతులు దుకాణం ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. సోమవారం రాత్రి సమయంలో కొందరు దొంగలు అంగిడికి వేసిన తాళాలను పగలగొట్టి సిగరెట్ ప్యాకులు, తదితర వస్తువులు చోరీ చేసినట్లు బాధితులు తెలిపారు. గత రెండు రోజుల క్రితం ఒక సెల్ ఫోన్ దుకాణం తాళాలు బద్దలు కొట్టి అందులో సామాగ్రిని చోరీ చేశారు. అదేవిధంగా దిగుమర్రి రోడ్డు లోని ఓ కిరాణా దుకాణం తాళాలు పగలగొట్టడంతోపాటు రెండు ఎరువుల గోడౌన్ల తాళాలను కూడా దొంగలు బద్దలు కొట్టారు. దీనిపైన కొందరు అనుమానితులను విచారణ చేస్తున్నామని త్వరలోనే ఈ దొంగతనాలకు పాల్పడిన దొంగలను పట్టుకుంటామని ఎస్సై రాజశేఖర్ రెడ్డి తెలిపారు.