ఎన్నికల ప్రధాన అధికారికి టిడిపి లేఖ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : చిత్తూరు జిల్లా ఎస్పితో పాటు కొంతమంది పోలీస్ అధికారులను బదిలీ చేస్లూ ఇటీవల రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని టిడిపి కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికలప్రధాన అధికారికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు శనివారం లేఖ రాశారు. ఈ నెల 14వ తేదిన ఎస్పితో పాటు అధికారులు, కానిస్టేబుళ్లను బదిలీ చేశారని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ నేపధ్యంలో చివరి నిమిషంలో చేసిన ఈ బదీలలకు కారణం ఏమిటని ప్రశ్నించారు. అధికారులు కానిస్టేబుళ్ల నుంచి ఎటువంటి బదిలీ వినతులు కోరకపోయినా చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయ ప్రేరిపితమైన వీటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఓటర్ల జాబితాలో తప్పులు సరిచేసేలా ఈఆర్ఓలు రాజకీయ పార్టీలతో వారంతపు సమావేశాలు నిర్వహించడం లేదని టిడిపి పొలిట్ బ్యూరోసభ్యులు ఎంఏ షరీఫ్ మరో లేఖ రాశారు. ఎన్నికల సంఘం ఆదేశించినా పాడేరు, రంపచోడవరం, నరసరావుపేట, సత్యవేడు, తాడిపత్రిలలో జరపడం లేదన్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కాకర్ల వెంకట్రామిరెడ్డి అధికార పార్టీ తరపున ఎన్నికలప్రచారం నిర్వహిస్తున్నారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
గ్రూప్-1 అక్రమాలపై గవర్నర్కు ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఎపిపిఎస్సి) నిర్వహించిన గ్రూప్-1 అక్రమాలపై చర్యలు తీసుకోవాలని టిడిపి నేతలు రాష్ట్రగవర్నర్ను కోరారు. రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
అచ్చెన్నాయుడుతో పాటు టిడిపి పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావు, నక్కా ఆనంద్బాబు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి గవర్నర్ను కలిశారు. అసలు దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
వైసిపి జాబితాలో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం
వైసిపి ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్సీ జి దీపక్ రెడ్డి, టిడిపి అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి విమర్శించారు.